నికోలస్ పూరన్ వీరవిహారం..విండీస్ ఘన విజయం
టీ20 ప్రపంచ కప్ గ్రూప్ సీ మ్యాచ్లో వెస్టిండీస్ 104 రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. నికోలస్ పూరన్ వీరవిహారం సృష్టించాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. 53 బంతుల్లో ఆ హిట్టర్ 98 రన్స్ చేశాడు
టీ20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆప్గాన్తో జరిగిన మ్యాచ్లో అత్యధిక స్కోరు నమోదైంది. పస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టపోయి ఏకంగా 92 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధికం. 2014లో ఐర్లాండ్పై నెదర్లాండ్స్ ఒక వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డును విండీస్ అధిగమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నికోలస్ పూరన్ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
బ్యాట్తో రెచ్చిపోయిన పూరన్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి సెంచరీకి రెండు పరుగుల ముందు రనౌట్ అయ్యాడు. చార్లెస్ 43, షాయ్ హోప్ 25, రోవ్మన్ పావెల్ 26 రన్స్ చేశారు. అనంతరం 219 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. జట్టులో ఇబ్రహీం జద్రాన్ చేసిన 38 పరుగులే అత్యధికం. అజ్మతుల్లా ఒమర్జాయ్ 23, కెప్టెన్ రషీద్ ఖాన్ 18 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్కాయ్ 3, అకీల్ హొసీన్, గుడకేశ్ మూతీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 98 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన పూరన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో గ్రూప్ సీలో విండీస్ టీమ్ టాప్ ప్లేస్లో నిలిచింది.