వాళ్లు కాంగ్రెస్ చేతిలో పావులు
ఫోగట్, పూనియాపై బ్రిజ్ భూషణ్ విమర్శలు
వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ చేతిలో పావులని.. ఆ పార్టీ చేసిన కుట్రలో భాగంగానే తనకు వ్యతిరేకంగా వాళ్లు ఉద్యమించారని బీజేపీ నాయకుడు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ ఆరోపించారు. వినేశ్, బజరంగ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై శనివారం ఆయన స్పందించారు. 2012లో జరిగిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యాణ మాజీ సీఎం భూపీందర్ హుడా తనయుడు దీపిందర్ హుడాను తాను ఓడించానని, అప్పటి నుంచి తనపై కాంగ్రెస్ కుట్ర పన్నిందని అన్నారు. భూపీందర్ కుట్రలో వినేశ్, బజరంగ్ పావులుగా మారారని అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ను అడ్డంపెట్టుకొని బీజేపీపై విమర్శలు చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఆయన బృందం కుట్ర చేసి పోరాటం చేయించారని తెలిపారు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన వినేశ్ ఫోగట్ ను హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దించింది. జులానా అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేయనున్నారు. బజరంగ్ పూనియాను ఆల్ ఇండియా కినాస్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. బ్రిజ్ భూషణ్ ఆరోపణలపై బజరంగ్ పూనియా స్పందించారు. వినేశ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయని అన్నారు. ఫోగట్ పతకం సాధించకపోవడం ఆమె వ్యక్తిగతమైన అంశం కాదని, దేశ ప్రజలందరికీ సంబంధించినదని అన్నారు.