నేపాల్ను ఓడించి సూపర్-8కు చేరిన బంగ్లాదేశ్
టీ 20 ప్రపంచకప్లో లీగ్ స్టేజ్లో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజాగా నేపాల్పై బంగ్లాదేశ్ గెలుపొంది గ్రూప్-డీ నుంచి రెండో జట్టుగా సూపర్-8కు అర్హత సాధించింది.
టీ 20 ప్రపంచకప్లో లీగ్ స్టేజ్లో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజాగా నేపాల్పై బంగ్లాదేశ్ గెలుపొంది గ్రూప్-డీ నుంచి రెండో జట్టుగా సూపర్-8కు అర్హత సాధించింది. దీంతో నెదర్లాండ్ ఆశలు అడియాశలయ్యాయి. ఆ జట్టు ఆడిన చివరి మ్యాచ్ నామమాత్రంగానే మిగిలిపోయింది. దీంతో సూపర్-8కు చేరే జట్లు ఏవో తేలిపోయింది.
ప్రపంచకప్ పోటీలో భాగంగా జరిగిన మ్యాచ్లో నేపాల్పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సూపర్ 8కు వెళ్లింది. బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 19.3 ఓవర్లలో 106 పరుగులు చేసింది. లామిచానె, సోంపాల్, దీపేంద్రసింగ్, రోహిత్ పౌడెల్ చెరో రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ తీవ్రంగా ఇబ్బంది పడింది. టాప్ ఆర్డర్లో ఆసీఫ్ (17) మినహా ఎవరూ రాణించలేదు. మిడిల్ ఆర్డర్లో కుశాల్ (27),దీపేంద్రసింగ్ (25) కీలక భాగస్వామ్యాన్నినెలకొల్పి గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలోనే ఔట్ కావడంతో 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లలో హసన్ షకీబ్ 4 , రహమాన్ 3 వికెట్లు తీశారు.
చివరి లీగ్ మ్యాచ్ నామమాత్రమే
సూపర్-8కు అర్హత సాధించే అవకాశం లేని శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్లలో విజయం సాధించాయి. ఐర్లాండ్పై పాక్ అతి కష్టంగా మూడు వికెట్ల తేడాతో గెలుపొందగా.. నెదర్లాండ్పై శ్రీలంక 83 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రోజు రాత్రి 8 గంటలకు న్యూజిలాండ్-పావువా న్యూగినీ మ్యాచ్ జరగనున్నది. ఇది కూడా నామమాత్రపు మ్యాచే. ఇక మంగళవారం ఉదయం 6 గంటలకు వెస్టిండీస్-అఫ్ఘానిస్థాన్ చివరి పోరుతో లీగ్ స్టేజ్ ముగుస్తుంది.