సత్తా చాటిన అమన్.. రెజ్లింగ్లో భారత్కు మెదటి మెడల్
భారత పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ సత్తాచాటాడు. 57 కిలోల విభాగంలో జరిగిన కాంస్యం పోరులో భారత్కు మొదటి పతకాన్ని అందించాడు.
భారత పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ సత్తాచాటాడు. 57 కిలోల విభాగంలో జరిగిన కాంస్యం పోరులో ఫ్యూక్టోరియా రెజ్లర్ డారియన్ క్రజ్పై 13-5 తేడాతో ఘన విజయం సాధించించాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెజ్లింగ్ విభాగంలో అమన్ మొదటి పతకాన్ని అందించాడు. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో మొత్తం 6 ఒలింపిక్స్ పతకాలు చేరాయి. వీటిలో ఒకటి రజతం, ఐదు కాంస్య మెడల్స్ ఉన్నాయి.
గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో 10-0తో మాజీ యూరోపియన్ ఛాంపియన్ వ్లాదిమిర్ ఎగోరోవ్ (ఉత్తర మెసెడోనియన్), క్వార్టర్స్లో అల్బేనియాకు చెందిన మాజీ ఛాంపియన్ జెలిమ్ఖాన్ 12-0 మట్టికరిపించిన అమన్ సెమీస్లో ఐదో ఐఈడ్ రీ హిగుచీ (జపాన్) 0-10 తేడా ఓడిపోయిన విషయం విదితమే. అయితే కాంస్యం పోరులో మాత్రం అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడాడు.
రెజ్లింగ్లో ఇప్పటివరకు ఒక్క పతకం లేకపోవడంతో అమన్పైనే భారత్ ఆశలు పెట్టుకున్నది. వారి ఆశలన వమ్ము చేయకుండా మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన 21 ఏళ్ల అమన్ తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు. భారత్ తరఫున ఒలింపిక్ మెడల్ అందుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఒలింపిక్ చరిత్రలో రెజ్లింగ్లో ఇండియాకు ఇది 8వవ మెడల్.
ఈ ఘనతను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది: ప్రధాని
కాంస్య పోరులో విజయం సాధించిన అమన్కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. అమన్ అంకితభావం, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనతను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుందన్నారు.
అమన్ గెలుపు అందరికీ స్ఫూర్తినిస్తుంది: సీఎం రేవంత్
పారిస్ ఒలింపిక్స్ 2024లో దేశానికి మరో మెడల్ సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అమన్ గెలుపు అందరికీ స్ఫూర్తినిస్తుందని సీఎం పేర్కొన్నారు.