ప్రీక్వార్టర్స్కు ఆకుల శ్రీజ.. పతకానికి అడుగు దూరంలో లవ్లీనా
పారిస్ ఒలింపిక్స్లో ఐదోరోజు భారత్కు అనుకూల ఫలితాలు వచ్చాయి..
పారిస్ ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్లో తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ ప్రీక్వార్టర్స్కు చేరారు. సింగపూర్ క్రీడాకారిణి జెంగ్పై 4-2 తేడాతో విజయం సాధించారు. తన పుట్టినరోజు నాడే ఒలింపిక్స్లో టీటీ సింగిల్స్లో ప్రీక్వార్టర్స్కు చేరిన రెండో ప్లేయర్గా శ్రీజ రికార్డు సృష్టించారు.
తొలిగేమ్లో శ్రీజ వెనుకబడినా.. ఆ తర్వాత అదరగొట్టింది. ప్రత్యర్థిని 9-11,12-10,11-4,11-5, 10-12,12-10తో ఓడించి ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లింది. అలాగే మరో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా ప్రీక్వార్టర్స్లో 1-4 తేడాతో మియు హిరానో (జపాన్ చేతిలో పరాజయం పాలయ్యారు.
పతకానికి అడుగు దూరంలో లవ్లీనా
భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ పారిస్ ఒలింపిక్స్లో అదరగొడుతున్నది.ఈ అస్సామీ అమ్మాయి మహిళల 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. రెండో ఒలింపిక్ పతాకానికి అడుగు దూరంలో నిలిచింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో లవ్వీనా నార్వే బాక్సర్ సునీవా హుఫ్సాటడ్తో తలపడింది.
లవ్లీనా మొదటి నుంచే ప్రత్యర్థిపై పంచులతో విరుచుకుపడింది. ఐదు రౌండ్లలోనూ పదికి తొమ్మిది పాయింట్ల చొప్పున సంపాదించింది. ఈ క్రమంలో 5-0తో సునీవాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నది. తర్వాత మ్యాచ్ చైనాకు చెందిన లీ కియాన్ తో ఆగస్టు 4న పోటీ పడనున్నది. లీ కియాన్ టోక్ఓ ఒలింపిక్స్ లో రజతం, 2016 రియో ఒలింపిక్స్లో కాంస్యం సాధించింది.