మేఘా కంపెనీపై రేవంత్ ప్రత్యేక ఆసక్తిపై ఆంతర్యం ఏమిటో?
సుంకిశాల ఘటనకు కారణమైన మేఘా కంపెనీపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సీఎం రేవంత్రెడ్డి 4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు అప్పగించడానికి సిద్ధమయ్యారని కేటీఆర్ విమర్శించారు.
సుంకిశాల ఘటనకు కారణమైన మేఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సదరు సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సీఎం రేవంత్రెడ్డి 4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు అప్పగించడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం మేఘా చేతికే అని పత్రికలో వచ్చిన క్లిప్ను దానికి జత చేశారు.
సుంకిశాల ఘటనకు కారణమైన కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేశాం. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ సంపద దోచుకుంటున్న ఈస్ట్ కంపెనీగా అభివర్ణించిన రేవంత్రెడ్డి ఇవాళ మేఘా సంస్థపై ఎందుకింత ప్రేమ చూపెడుతున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఆ కంపెనీపై రేవంత్ ప్రత్యేక ఆసక్తిపై ఆంతర్యం ఏమిటో చెప్పాలని నిలదీశారు.