హైదరాబాద్లో హైడ్రా దూకుడు..పలు చోట్ల కూల్చివేతలు
హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో ఆక్రమణలు కూల్చివేస్తోంది.
హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో ఆక్రమణలు కూల్చివేస్తోంది. మాదాపూర్, సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్ను ఈ రోజు ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో తమ ఇల్లు కూలుస్తున్నారని ఓ మహిళ కన్నీరు పెట్టుకున్నారు అంతేకాదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి పోరాటాలు చేసి తెలంగాణ తెస్తే నువ్వు మా కడుపు కొట్టడానికే మా ఇల్లు కూలగొడ్తున్నావ్ అంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేట్లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని హెచ్ఎంటీ కాలనీ, వాణీనగర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్కు చెందిన జయభేరీ కన్స్ట్రక్షన్కు నోటీసులు ఇచ్చి 15 రోజులు డెడ్ లైన్ విధించింది హైడ్రా.