నిరుద్యోగ భృతి ఏమైంది? జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడు?: కిషన్రెడ్డి
గ్రూప్-1 మెయిన్స్కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, అలాగే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా గ్రూప్-2 783 పోస్టులను 2000లకు, గ్రూప్-3 1365 పోస్టులను 3000లకు పెంచాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి జాబ్ క్యాలెండర్ విషయమే మరిచిపోయారని, నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.హైదరాబాద్ లోని ధర్నా చౌక్లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ విస్మరించి అధికారంలో వచ్చాక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదని విమర్శించారు.
గ్రూప్-1 మెయిన్స్కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా గ్రూప్-2 783 పోస్టులను 2000లకు, గ్రూప్-3 1365 పోస్టులను 3000లకు పెంచాలన్నారు. మెగా డీఎస్సీలో భాగంగా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగులకు వెంటనే రూ. 4 వేల భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియన వెంటనే చేపట్టాలన్నారు.
కాంగ్రెస్ నేతలు ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారని, రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ తెస్తామన్న మార్పు రాలేదు కాని అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మాత్రమే మార్పు వచ్చిందని ఆయన దుయ్యబట్టారు.