జీవో 46కు పరిష్కారంపై కసరత్తు చేస్తున్నాం: శ్రీధర్బాబు
జీవో 46కు పరిష్కారంపైన మంత్రి వర్గ సబ్ కమిటీ కసరత్తు చేస్తున్నది. భవిష్యత్తులో జీవో 46 అసలు ఉండదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
శాసనసభ సమావేశాలు 9 రోజులు జరిగాయని అసెంబ్లీ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మా ప్రభుత్వమే మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని మంత్రి అన్నారు. 38 శాఖల డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించింది. 65 గంటల 33 నిమిషాల పాటు అసెంబ్లీ పనిచేసిందన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 17 గంటలకు పైగా అసెంబ్లీ జరిగింది. 17 గంటలకు పైగా జరిగిన చర్చలో 24 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని మంత్రి వెల్లడించారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ పద్దులపై మాట్లాడేందుకు కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. యువత భవిష్యత్తు కోసం స్కిల్ యూనివర్సి టీ బిల్లును ఆమోదించుకున్నట్లు తెలిపారు. ఐదు ప్రభుత్వ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తన నిర్ణయం చెబుతారని ఆశించామన్నారు. జీవో 46కు పరిష్కారంపైన మంత్రి వర్గ సబ్ కమిటీ కసరత్తు చేస్తున్నది. భవిష్యత్తులో జీవో 46 అసలు ఉండదని మంత్రి తెలిపారు.