గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగుల నిరసన
గ్రూప్-2, డీఎస్సీ వాయిదా వేయటం తో పాటు గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ.. అశోక్నగర్లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. నిరుద్యోగుల నిరసన ప్రదర్శనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఫలితంగా వాళ్లు నిత్యం రోడ్లు మీదికి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి రేవంత్ సర్కార్ కల్పించింది.లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి నిరుద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం వాళ్లను రాజకీయ నిరుద్యోగులుగా, అసలు వాళ్లు నిరుద్యోగులే కాదని అడ్డగోలుగా మాట్లాడుతున్నది. దీంతో నిరుద్యోగులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు.
గ్రూప్-2,3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆందోళన నిర్వహించారు. చిక్కడపల్లి చౌరస్తా నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్లో బైఠాయించి నిరసన తెలిపారు. వీ వాంట్ జస్టిస్, గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని నినదించారు. ఈ క్రమంలో ఓ నిరుద్యోగి సొమ్మసిల్లి పడిపోయాడు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.