భారీ వర్షాలున్నాయ్.. ఇంజనీర్లు అలర్ట్ గా ఉండాలి
అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు, ఇంజనీర్లు అలర్ట్ గా ఉండాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని తేల్చిచెప్పారు. ఇంజనీర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దన్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రాజెక్టులకు ఇన్ ఫ్లోల ఆధారంగా గేట్లు ఎత్తే విషయం ముందుగానే లొతట్టు ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్యామ్ లు, చెరువు కట్టలతో పాటు కాల్వలను పరిశీలించాలన్నారు. రైల్వే లైన్లకు ఎగువన ఉన్న చెరువులను క్షుణ్నంగా మానిటరింగ్ చేయాలన్నారు. విపత్తులు సంభవిస్తే అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.