నేతన్నల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసేందుకు రేవంత్‌ సర్కార్‌ కుట్ర చేస్తున్నదని కేటీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే 10 నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

By :  Raju
Update: 2024-07-09 05:35 GMT

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల పై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించామన్నారు. ఏడేళ్ల పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో చేనేతలు, నేతన్నల ఆత్మహత్యలు తగ్గిపోయాయని గుర్తు చేశారు. ఏటా రూ. 350 కోట్ల బడ్జెట్ తో బతుకమ్మ, రంజాన్, క్రిస్ మస్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి చీరలను పంపిణీ చేసేదని గుర్తు చేశారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. గత ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కారణంగా పేద మహిళలకు పండుగ పూట ప్రభుత్వ కానుకగా చీర అందేదన్నారు. అదే విధంగా చేనేత కార్మికులు, నేతన్నలు అనుబంధంగా ఎంతోమంది ఉపాధి పొందే వారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్‌ కోరారు. తమ ప్రభుత్వం మీద కక్షతో నేతన్నలు, చేనేతల ఉసురు తీయవద్దని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసిన కారణంగా ఇప్పటికే 10 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆర్డర్లు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన ఆర్టికల్ ను ట్విట్టర్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాలోచిత చర్యలు మాని వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలు, చేనేతలకు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News