ఉగ్ర కుట్ర..ఢిల్లీలో హై అలర్ట్
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఢిల్లీ, పంజాబ్ ఆత్మాహుతి జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో రాష్ట్రపతి భవన్ సహా అన్నిచోట్ల భద్రత కట్టుదిట్టం చేశారు.
ఢిల్లీలో జరిగే 78వ స్వాతంత్ర వేడుకలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. రేపు హస్తినలో జరిగే స్వాతంత్ర వేడుకల్లో విధ్వంసం సృష్టించడానికి ఓ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్టు వెల్లడించాయి. ఇప్పటికే జమ్ము నుంచి ఓ ఉగ్రసంస్థ నుంచి ఢిల్లీకి వచ్చారని వారు ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15వ తేదీనే ఈ దాడి జరుగుతుందని తాము చెప్పలేమని ఆ వర్గాలు తెలిపాయి. పంద్రాగస్టు వేడుకల వేళ పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నందున రెండు రోజుల తర్వాత దాడి జరిగే ప్రమాదం ఉన్నదని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులు స్థానికంగా జరిగే స్వాతంత్ర వేడుకలకు, అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించడానికి కుట్ర పన్నుతున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ సహా ఢిల్లీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.