జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ట ఉత్పత్తికి చర్యలు చేపట్టండి : భట్టి

థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 17 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలని, అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు.

By :  Raju
Update: 2024-08-10 07:20 GMT

కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో పెట్టుకొని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శనివారం ప్రజాభవన్ లో థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించిన ఆ శాఖల సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్ లో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మనమంతా నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని.. అలసత్వానికి, ఆలస్యానికి తావు లేదని తెలిపారు. విద్యుత్ శాఖలో పని చేయడం అంటే ప్రజల కోసం 24/7 పనిచేసే అత్యవసర శాఖ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అని స్థాయిలోని అధికారులు, సిబ్బంది గుర్తుపెట్టుకోవాలన్నారు. సమాజానికి వెలుగులు ఇచ్చే శాఖలో పనిచేస్తున్నామని పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వినడానికి, వాటిని పరిష్కరించడానికి 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం  అధికారులు, సిబ్బందికి భరోసా ఇచ్చారు.

విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తద్వారా ఏర్పడిన నష్టాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్నారు. వారానికి ఒకసారి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు తనకు పంపాలని ఆదేశించారు. అధికారులకు ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహించినట్లుగా ఉంటే రాతపూర్వకంగా వారి నుంచి వివరణ తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తనియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌, ఇంధనశాఖ ఓఎస్‌డీ సురేందర్‌రెడ్డి, జెన్ కో డైరెక్టర్లు, సీఈ లు పాల్గొన్నారు. 

Tags:    

Similar News