ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ పై సుప్రీం కీలక తీర్పు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

By :  Raju
Update: 2024-08-01 05:37 GMT

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉప వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. 2004లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉప వర్గీకరణ చేయవద్దని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. 

2004లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇ.వి. చిన్నయ్య వర్సెస్‌ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రిజర్వేషన్ ప్రయోజనాలను ఏ వర్గాలకు అందజేయవచ్చో రాష్ట్రపతి మాత్రమే తెలియజేయగలరని, దీన్ని తారుమారు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొన్నది.నాటి తీర్పుపై పంజాబ్‌ ప్రభుత్వం, ఎమ్మార్పీఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

విద్యా, ఉద్యోగ అంశాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు 7 గురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రాలకు అలాంటి అధికారం ఉండదని, పార్లమెంటు మాత్రమే ఎస్సీ, ఎస్టీ కోటాలో రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయగలదంటూ పేర్కొంటూ.. 2004లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి.

ఎస్సీ వర్గీకరణ చెల్లదని పంజాబ్‌, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఈ కేసులో ప్రధాన వ్యాజ్యంగా ఉన్నది. దీనితో పాటు మరో 22 పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ సమానత్వాన్నికల్పించే రాజ్యంగ అధికరణం 14కు భంగం కలిగించేలా ఉన్నదని సుప్రీంకోర్టు ఇ.వి. చిన్నయ్య కేసులో తీర్పు ఇచ్చింది. షెడ్యూల్‌ కులాల జాబితాలోకి ఏవైనా ఉప కులాలు చేర్చాలన్నా.. తొలిగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని.. రాష్ట్రాల శాసనసభలకు కాదని 2004లో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నది. తాజాగా జరిగిన విచారణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు ఉప వర్గీకరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని సుప్రీంకోర్టుకు తెలిపింది. 

2004 లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉప వర్గీకరణ చేయవద్దన్న నాటి తీర్పును సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్‌ బేలా త్రివేది వ్యతిరేకించారు. ఉప వర్గీకరణకు సీజేఐతో పాటు అనుకూలంగా జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర తీర్పు ఇచ్చారు.సుప్రీం తీర్పును అనుసరించి ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని పేర్కొన్నది.

Tags:    

Similar News