ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ
జీఏడీలో రిపోర్ట్ చేయాలని మైనార్టీ గురుకుల సెక్రటరీకి ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ గా ఉన్న సురేంద్ర మోహన్ కు అదే శాఖ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ తఫ్సీర్ ఇక్బాల్ కు మైనార్టీ గురుకులాల సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ పని చేస్తున్న ఆయేషా మస్రత్ ఖానమ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక్బాల్ ఐఎస్డబ్ల్యూ డీఐజీగాను కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ వినయ్ కృష్ణారెడ్డికి ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజేషన్ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కల్పించారు. ఆ బాధ్యల్లో ఉన్న ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ను రిలీవ్ చేశారు. హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాషాకు మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ నిర్మల కాంతి వెస్లీని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా పూర్తి అదనపు బాధ్యతల్లో నియమించారు. ములుగు లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ శ్రీజను ఖమ్మం లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ చేశారు. హెచ్ఎండీఏలో పని చేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అస్మదుల్లాను వక్ఫ్ బోర్డు సీఈవోగా బదిలీ చేశారు. ఇండస్ట్రీస్ డైరెక్టర్ మల్సూర్ ను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా నియమించారు.