బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్
సభ్యులుగా మరో ముగ్గురి నియామకం
బీసీ కమిషన్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరంజన్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ కమిషన్ సభ్యులుగా న్యాయవాది, కాంగ్రెస్ లీగల్ సెల్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్, ప్రముఖ జర్నలిస్ట్, ఉమ్మడి ఏపీలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పని చేసిన తిరుమలగిరి సురేందర్, తెలంగాణ ఉద్యమకారిణి బాలలక్ష్మీని నియమించారు. బీసీ వెల్ఫేర్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. కొత్త బీసీ కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ గణన చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీసీ కమిషన్ కాల పరమితి, విధివిధానాలకు సంబంధించిన ఉత్తర్వులు ప్రత్యేకంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. కొత్త బీసీ కమిషన్ కు ప్రత్యేకంగా ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో బీసీ గణన చేపట్టి దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు పెంచాల్సి ఉంది. కొత్త కమిషన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ బాధ్యతలు అప్పగించనున్నారు.