వరద బాధితులకు ఎస్బీఐ రూ.5 కోట్ల సాయం
సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేసిన అధికారులు
తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం అందజేసింది. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గురువారం ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో డీజీఎం జితేందర్ శర్మ, ఏజీఎంలు దుర్గాప్రసాద్, తనూజ్ తదితరులు పాల్గొన్నారు.
అరబిందో ఫార్మా రూ.5 కోట్లు, ఏఐజీ హాస్పిటల్ రూ.కోటి విరాళం
వరద బాధితుల కోసం అరబిందో ఫార్మా రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్, ఎండీ నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి తదితరులు కలిసి చెక్కు అందజేశారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి రూ.కోటి చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.