ఉక్రెయిన్లో నలుగురు కీలక మంత్రుల రాజీనామా
పునర్ వ్యవస్థీకరణ మొదలుపెట్టిన ఉక్రెయిన్ ప్రభుత్వం
రష్యాతో యుద్ధం కీలక దశలో ఉన్న సమయంలో ఉక్రెయిన్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు రాజీనామా చేస్తున్నారు. తాజాగా విదేశాంగశాఖ మంత్రి దిమిత్రి కులేబా రాజీనామా చేసినట్లు పార్లమెంట్ స్పీకర్ వెల్లడించారు. దీనిపై తదుపరి ప్లీనరీ సమావేశంలో చట్టసభ సభ్యులతో చర్చిస్తామని తెలిపారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఇప్పటికే వ్యూహాత్మక పరిశ్రమ శాఖమంత్రి ఒలగ్జాండర్ కమ్యాసిన్ సహా నలుగురు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొందరు మంత్రులను జెలన్స్కీ తొలిగించారు. దీంతో మూడోవంతు మంత్రివర్గం ఖాళీ అయ్యింది.
శీతాకాల ప్రచారానికి ముందు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు అధ్యక్షుడు జెలన్స్కీ గత వారం సంకేతాలిచ్చారు.రష్యాతో యుద్ధంతో క్లిష్ట సమయంలో ఉక్రెయిన్ ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణను ఎదుర్కొంటున్నది.2019లో ఎన్నికైన జెలెన్ స్కీ గత వారం పెద్ద పునర్వ్యవస్థీకరణను ప్లాన్ చేసినట్లు సంకేతాలు ఇచ్చారు. తన సాధారణ ప్రసంగాల్లోనూ మార్పు ఆవశ్యకతను పునరుద్ఘాటించారు.