రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలే.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రంలో రాబోయే ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి శనివారం వరుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సోమవారం మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జనగాం జిల్లాలో భారీ వానలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడుతాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.