జగిత్యాల జడ్పీ మీటింగ్లో పవర్ కట్
జగిత్యాల జిల్లా జడ్పీ సర్వసభ్య అధికారిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ ఇంజినీర్ సత్యనారాయణ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని ప్రసంగిస్తుండగానే కరెంట్ పోయింది.దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కోతలే అనేది ఈ ఆరు నెలల కాలంలో అనేకసార్లు రుజువైంది. కానీ సీఎం సహా మంత్రులంతా అదంతా విపక్ష పార్టీ తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నదని బుకాయించారు. కానీ కరెంటు విషయంలో విద్యుత్ శాఖ మరోసారి అభాసుపాలైంది.
జగిత్యాల జిల్లా జడ్పీ సర్వసభ్య అధికారిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ ఇంజినీర్ సత్యనారాయణ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని ప్రసంగిస్తుండగానే కరెంట్ కట్ అయ్యింది. ఈ పరిణామాన్ని చూసి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ ఛైర్పర్సన్ వసంత, వైస్ ఛైర్మన్ హరిచరణ్ నవ్వవుకున్నారు. కరెంటు కోతల లేవని, నాణ్యమైన 24 గంటలు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది.
జిల్లాలో కరెంటు సరఫరా గురించి విద్యుత్ శాఖ ఇంజినీర్ వివరాలు చెబుతుండగానే కరెంట్ పోయింది. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అలాగే కొనసాగిస్తుండగా.. మరో అధికారి కరెంటు ఎందుకు పోయిందో తెలుసుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. తన ప్రసంగం అనంతరం ఏమైనా ఉంటే అడగాలని జడ్పీటీసీలను కోరితే... కరెంటే పోయింది. ఇంకా ఏమి అడగమంటారు అని సెటైర్లు వేశారు. కరెంటు ఎప్పుడు పోతున్నదో.. ఎప్పుడు వస్తున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నదని దీనికే మీరు సమాధానం చెప్పాలని మహిళా జడ్పీటీసీలు ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, విప్ లక్ష్మణ్ కుమార్ కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
రాష్ట్రం కరెంటు కోతలపై సోషల్ మీడియా పోస్టులు పెడితే ప్రభుత్వం కేసులు పెడుతున్నది. అధికారిక కార్యక్రమాల్లోనే అనేకసార్లు కరెంటు పోయినా ప్రభుత్వం దానిని తేలికగా కొట్టిపారేసింది. జగిత్యాల సర్వసభ్య అధికార కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారని నెటీజన్లు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది. కరెంటు పోయింది అని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.