శాంతి భద్రతల విషయంలో పోలీసులు నిత్యం అప్రమత్తం ఉండాలి : డీజీపీ
తెలంగాణలో నేరాల నియంత్రణపై డీజీపీ జితేందర్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. డీజీపీ కార్యాలయంలో సమగ్ర అర్ధవార్షిక సమావేశానికి జిల్లాల ఎస్పీలు, సీపీలు, ఐజీలు, డీఐజీలు, స్టాఫ్ అధికారులు హాజరయ్యారు.
తెలంగాణలో నేరాల నియంత్రణపై డీజీపీ జితేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల విషయంతో నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేరస్థులను ఉపేక్షించే పరిస్థితి లేదని, న్యాయస్థానాల్లో వారికి శిక్షపడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు.
మహిళలపై, చిన్నారులపై నేరాలపై, సైబర్ నేరాలపై, మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. డయల్ 100 ప్రతిస్పందన సమయాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీపీ శిఖా గోయల్ నేరాల ధోరణులపై వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ప్రధాన నేరాల విశ్లేషణ నివేదికను సమర్పించి, ఆయా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలపై వివరించారు. టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై, టీజీసీఎస్బీ డైరెక్టర్ సైబర్ నేరాలపై వివరించారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నివారణకు యుద్ధప్రాతిపదికన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.