మున్నేరు బాధిత ప్రాంతాల్లో వద్దిరాజు పర్యటన
నిర్వాసితులకు అండగా నిలిచిన ఎంపీ
మున్నేరు ఉప్పొంగి నీట మునిగిన ఖమ్మం పట్టణంలో సోమవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. వెంకటేశ్వర నగర్ కాలనీ, కాల్వొడ్డు బొక్కలగడ్డ, ప్రకాశ్ నగర్ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి వద్దిరాజు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వాళ్లు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు కన్నీటి పర్యంతమయ్యారు. మున్నేరు ఉప్పొంగి సర్వస్వం ఊడ్చుకుపోయిందని, కట్టుబట్టలతో మిగిలామని.. కనీసం తినడానికి బియ్యం కూడా లేవని చెప్పారు. సర్టిఫికెట్లు, ఇంట్లోని వస్తువులన్నీ తడిచిపోయాయని, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులేవి పనికి వచ్చేలా లేవని తెలిపారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందజేశారు. ఎవరూ అధైర్య పడవద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీ వెంట నాయకులు తోట రామారావు, గోవిందమ్మ, కృష్ణ, నాగరాజు, వీరభద్రం, నాగేశ్వర్ రావు తదితరులు ఉన్నారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించిన ఎరబడి నర్సింహారావును ఎంపీ వద్దిరాజు అభినందించారు.