ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేది హర్షకుమారే : మందకృష్ణ

మాలల్లో రాజకీయంగా ఎదిగిన అనేక మంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని.. విప్లవోద్యమం పేరుతో దళితులను వాడుకున్నారని మందకృష్ణ విమర్శించారు.

By :  Vamshi
Update: 2024-08-21 11:10 GMT

ఎస్సీ వర్గీకరణను అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ అడ్డుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. హర్ష కుమార్ తెలుగు దేశం పార్టీలో చేరడం ఉద్దేశమేంటని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం తప్ప ఆయన జాతి కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నా ఆ పార్టీ నేతలకు ఎందుకు బాధ అవుతుందో తెలియడం లేదని విమర్శించారు.

దీనిపై అతి త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి నిలదీస్తామని కృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాలల్లో రాజకీయంగా ఎదిగిన అనేక మంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని.. విప్లవోద్యమం పేరుతో దళితులను వాడుకున్నారని మందకృష్ణ విమర్శించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా 90% మంది మాలలు ఎమ్మార్పీఎస్‌కు మద్ధతు ఇచ్చారని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తిగానే ఉంటానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు చెబుతానన్నారు. ఎంతో కొంతో రేవంత్ రెడ్డిని నమ్ముతాను, ఖర్గేను నమ్మను అని వ్యాఖ్యానించారు.

వర్గీకరణకు మల్లిఖార్జున ఖర్గే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వాగతించారని, ఖర్గే ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు. ఖర్గే తమ కులానికే నాయకుడని, దళితుందరికీ కాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లు అనుకూలంగా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద నెపం వేసిండు. ఇవాళ రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పగానే మళ్ళీ పార్లమెంట్ ప్రస్తావన తీసుకొస్తున్నారని మందకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు

Tags:    

Similar News