రాజకీయాలు పక్కనపెట్టి రైతులకు సాగు నీరివ్వండి: హరీశ్‌

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు.

By :  Raju
Update: 2024-08-03 04:19 GMT

సిద్దిపేట జిల్లాలో సాగు నీరు లేక రైతులు పడుతున్న అవస్తలపై రాష్ట్ర భారీ నీటి పారుదల ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తి గా నీళ్లు లేక రిజర్వాయర్ లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయి. గత ఏడాది ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్ లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్ లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.

ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నానని హరీశ్‌ లేఖలో పేర్కొన్నారు.


 



Tags:    

Similar News