ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై అక్రమంగా కేసును ఖండించిన కేటీఆర్
KTR condemned illegal cases against MLA Kova Lakshmi
కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పైన ఆసిఫాబాద్ పోలీస్ట్లో అక్రమ కేసు నమోదు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసింది. కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరింది.
ప్రోటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారి తీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాలకు దిగారు. రాస్తారోకోలు చేపట్టారు. అయితే విశ్వప్రసాద్ రావు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 296(బీ), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ సహా అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అభియోగాలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126(2) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా పరిషత్ అధికారుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.