రేపు అసెంబ్లీకి కేసీఆర్..!
ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు అసెంబ్లీకి రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ల్పీ సమావేశం జరగనుంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా గులాబీ బాస్ సభకు వస్తుండటంతో ఆసక్తిగా మారింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేసీఆర్ మధ్య పలు అంశాలపై వాడీవేడి చర్చ జరిగే చాన్స్ ఉంది. కేసీఆర్ హాజరు కావాలని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా కోరుకుంటున్నాయి.
ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు, ఆరు గ్యారంటీల విషయంలో రేవంత్ సర్కార్ పై సభలో సమరమేనని ప్రకటించిన కేటీఆర్ , హరీష్… సభలో వారికి కేసీఆర్ తోడైతే కాంగ్రెస్ కు కొంత ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అయితే అసెంబ్లీకి రానున్న కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నదానిపై మాత్రం బీఆరెస్ వర్గాలు స్పష్టతనివ్వలేదు. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ కి హాజరుకావాలో మాకు స్ట్రాటజీ ఉందంటూ మాజీ మంత్రి టి.హరీశ్రావు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.