గాజాలో ఇజ్రాయిల్ దాడి.. 100 మందికి పైగా మృతి!
హమాస్, హెజ్బొల్లా కీలక నేతల హత్యలతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నప్పటికీ.. గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తున్నది.
హమాస్, హెజ్బొల్లా కీలక నేతల హత్యలతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నప్పటికీ.. గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తున్నది. తెల్లవారు జామును గాజా పట్టణంలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న తబీన్ పాఠశాలపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో వందమందికిపైగా మరణించగా..47 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ దాడిని ఇజ్రాయిల్ అంగీకరించింది.
పాఠశాలలో హమాస్ కమాండ్ సెంటర్ ఉండటంతో దాడి చేసినట్లు పేర్కొన్నది. గత వారం గాజాలోని మూడు పాఠశాలలపై ఇజ్రాయిల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించగా..పలువురు గాయాల పాలయ్యారు. ఆగస్టు 1న దలాల్ అల్ ముగ్రాబి స్కూల్ పై చేసిన దాడిల్లో 15 మంది మృతి చెందారు.గత ఏడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు తమ దేశంలో మెరుపు దాడులు చేసినందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్నది.
ఇజ్రాయిల్పై ప్రతీకార దాడిపై ఇరాన్ తర్జనభర్జన
మరోవైపు ఇజ్రాయిల్పై ప్రతీకార దాడి విషయంలో ఇరాన్ తర్జనభర్జన పడుతున్నది. హమాస్ చీఫ్ హనియా హత్య నేపథ్యం లో ఇజ్రాయిల్ నగరాలపై నేరుగా దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ భావిస్తున్నది. ఇజ్రాయిల్ కు చెందిన మొస్సాద్, అజర్బైజాన్, కుర్దిస్థాన్లో స్థావరాలపై దృష్టి సారించాలని ఇరాన్ ఆధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ సూచిస్తున్నారు.