దానం ఆవేశం వెనుక అనర్హత టెన్షనేనా?
ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ముందు వేటు పడేది దానంపైనే అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఆ టెన్షన్లో ఉండే ఆయన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శలు వాస్తవమే అనేలా దానం తాజా వ్యాఖ్యల బట్టి అర్థమౌతున్నది అంటున్నారు.
గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం. ఆ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత అబద్ధాలు ఆడాలి. ప్రజలను ఏమార్చాలనే అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగు జాడల్లో ఆయన నడవాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నది. అంతకు ముందు రోజు మహిళా శాసనసభ్యులపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆ అంశంపై మాట్లాడుతాను అంటేనే మైక్ ఇస్తానని లేకపోతే ఇవ్వనని స్పీకర్ చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం తనపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు మహిళా శాసససభ్యురాలికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆందోళన దానం నాగేందర్కు సభ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టించడానికి చేసినట్టు కనిపించిదట.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూనే సీఎంను, తనను కించ పరిచే విధంగా మాట్లాడటం వల్లనే సహనం కోల్పోయానని పచ్చి అబద్ధాలు మాట్లాడారు. సభలో బడ్జెట్ అంకెల గారడీపై హరీశ్రావు మాట్లాడినప్పుడు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. విద్యుత్ అంశంపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడినప్పుడు సమాధానం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేపై, ఆరు గ్యారెంటీలపై ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడిన దానికి ప్రభుత్వం దగ్గర నిర్దిష్ట సమాధానం లేదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, శాంతిభద్రతలపై మాజీ మంత్రి సబిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేదు. తొమ్మిది రోజుల శాసన సభ సమావేశాల్లో ప్రతిపక్షం సంధించిన ఏ ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పలేకపోయింది.
సీఎం సహా మంత్రులు, ఆపార్టీ ఎమ్మెల్యేలు విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం, దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇస్తుంటే స్పీకర్ అడ్డుకోవడం ప్రజలంతా చూశారు. ఇక దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడమే కాకుండా కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు, బీజేపీ ఎమ్మెల్యే దానం, తెల్లం, కడియంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు లో వేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతున్నది. వాస్తవాలు ఇలా అధికారం కోల్పోవడం వల్ల బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దానం అనడం హాస్యాస్పదంగా ఉన్నది. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ముందు వేటు పడేది దానంపైనే అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఆ టెన్షన్లో ఉండే ఆయన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శలు వాస్తవమే అనేలా దానం తాజా వ్యాఖ్యల బట్టి అర్థమౌతున్నది అంటున్నారు.