అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్, డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం రాత్రి సీఎస్ శాంతికుమారితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్కు సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తితే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.