చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల వచ్చిన వరదలు : జగన్
వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను కూటమి ప్రభుత్వం బేఖాతరు చేసిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారితో ప్రజలతో మాట్లాడారు.
వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.ఈ వరద నష్టం వెనుక చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని, వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడతాయని ఈ నెల 28నే వాతావరణ శాఖ చెప్పిందని, కానీ ఆ హెచ్చరికలను కూటమి సర్కారు పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ఇవి ప్రభుత్వ అలసత్వం వల్ల వచ్చిన వరదలు అని స్పష్టం చేశారు. వరద బాధితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోందని, బాధితులు ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని... ఒక్కరికి కూడా ప్రభుత్వ ఆర్థిక సాయం అందలేదని మండిపడ్డారు. కనీసం తినడానికి తిండి కూడా లేదని, ఎవరిని కదిలించినా కన్నీరు పెట్టుకుంటున్నారని, వారి కన్నీరు కూటమి ప్రభుత్వానికి కనిపించలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంతకంటే భారీ వర్షాలు కురిసినా, వాలంటీరు వ్యవస్థ సాయంతో పరిస్థితులను చక్కదిద్దామని జగన్ తెలిపారు. లక్షల మంది వరద బాధితులు ఉంటే, 6 పునరావాస శిబిరాలు ఎలా సరిపోతాయని నిలదీశారు.
విజయవాడలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చూస్తే, ప్రభుత్వం స్పందించిన తీరు ఏమాత్రం ఆయోదయోగ్యం కాదని విమర్శించారు.11 లక్షల క్యూసెక్కుల వరద రావడం కొత్తేమీ కాదన్నారు. గతంలో కూడా ఇదే స్థాయిలో వరదలు వచ్చాయిని జగన్ తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గతంలో వాలంటీర్లంతా సహాయక చర్యలు అందించేవారు. గతంలో ప్రతీ కుటుంబానికీ ఆర్థిక సహాయం అందించాం. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో గడపగడపకూ సహాయం చేశామని జగన్ గుర్తు చేశారు