ఊసరవెల్లి కూడా రేవంత్రెడ్డిని చూసి సిగ్గుపడుతుంది: హరీశ్రావు
పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్రెడ్డివి పరిణతి లేని వ్యాఖ్యలని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ గతం మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు.
పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్రెడ్డివి పరిణతి లేని వ్యాఖ్యలని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ గతం మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. నాడు గ్రూప్-2, టెట్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరితే మద్దతు తెలుపలేదా లేదా అని ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాటా? అని ధ్వజమెత్తారు. ఊసరవెల్లి కూడా రేవంత్రెడ్డిని చూసి సిగ్గుపడుతుందని హరీశ్ ఫైర్ అయ్యారు.
విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలు, జీవితాలతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి నడిరోడ్డన పడేలా చేశారని మండిపడ్డారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి నిరుద్యోగ అభ్యర్థులపై ఇలా దిగజారి మాట్లాడటం ఏమిటని ఘాటుగా వ్యాఖ్యానించారు. పగలు, రాత్రి తేడా లేకుండా అభ్యర్థులు పోరాడుతుంటే సానుభూతి చూపాల్సింది పోయి, రాజకీయ విమర్శలు చేస్తున్నారని హరీశ్ ఆక్షేపించారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని హరీశ్ విమర్శించారు.