రేవంత్‌ ప్రచారంలో నీతులు..? అధికారంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

By :  Vamshi
Update: 2024-06-25 13:10 GMT

ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్‌య్యారు. ముఖ్యమంత్రి గారు.. ప్రచారంలో నీతులు..? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..? ఆనాడు పార్టీ మారినవాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నాది మీరే. అందుకు జవాబు చెప్పాల్సింది కూడా మీరే అంటూ రేవంత్‌రెడ్డి వీడియోను ట్వీట్ చేశారు. నాడు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు. ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు. భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారు.

రాజీనామా చేయకుండా చేరితో ఊళ్లనుంచే తరిమికొట్టమన్నా రేవంత్ రెడ్డి మరి ఇవాళ తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా అని నిలదీశారు. జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి ఇప్పుడు ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారని, ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని? రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి అని గట్టిగా రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్న రేవంత్ ఇప్పుడు అందు తనే జవాబు చెప్పాలని కేటీఆర్ ఎక్స్ ద్వారా డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News