పొరపాట్లతో విజయాన్ని చేజార్చుకోవద్దు: యూనస్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సారథి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేడు ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు.
బంగ్లాదేశ్ ప్రజలు హింసకు దూరంగా ఉంటూ.. శాంతియుతంగా ముందడుగు వేయాలని తాత్కాలిక ప్రభుత్వం సారథి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లతో విజయాన్ని చేజార్చుకోవద్దని హితవు పలికారు. ప్రస్తుత పారిస్లో ఉన్న ఆయన నేడు ఢాకా వెళ్లి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ సలహా మండలిలో 15మందికి చోటు దక్కనున్నది.
గృహ నిర్బంధం నుంచి విడుదలైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. విధ్వంసం, ప్రతికారాలకు బదులు శాంతి ద్వారా దేశాన్ని మళ్లీ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. తన తల్లి ఏ దేశాన్ని ఆశ్రయం కోరలేదని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ పేర్కొన్నారు. కొన్నిరోజులు ఆమె భారత్లోనే ఉంటారని చెప్పారు.
తాత్కాలిక ప్రభుత్వం శాంతిని, రాజకీయ స్థిరత్వాన్ని స్థాపిస్తుందని భావిస్తున్నాం: మాథ్యూ మిల్లర్
బంగ్లాదేశ్లో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ప్రకటించారు. బంగ్లాదేశ్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ బాధ్యతలు చేపడుతున్న విషయం మా దృష్టి వచ్చింది. ఆ ప్రభుత్వం శాంతిని, రాజకీయ స్థిరత్వాన్ని స్థాపిస్తుందని భావిస్తున్నామని మిల్లర్ పేర్కొన్నారు