ప్రభుత్వ వెబ్సైట్లలో సమాచారం అదృశ్యం..సీఎస్కు కేటీఆర్ ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమైన సమాచారం కనిపించడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వెబ్ సైట్లుతో పాటు పలు సోషల్ మీడియా ఖాతాల్లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారని... బీఆర్ఎస్ పరిపాలనకు సంబంధించిన వేల ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారాన్ని వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి తొలగించారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించిన వైబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను లేఖలో కేటీఆర్ జత చేశారు.
పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్ ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యత ను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా సమగ్రమైన సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రజల ఆస్తితో ఈ సమాచారాన్నిసిద్దం చేశామని...ఇది ప్రజల ఆస్తి అని లేఖలో గుర్తు చేశారు. ఒక వ్యక్తికో, రాజకీయ పార్టీకో సంబంధించి సమాచారం కాదన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు, తర్వాత సంఘటనలకు సంబంధించి ఈ విలువైన సమాచారం శతాబ్దాల పాటు ఉండాల్సిన అవసరముందన్నారు.