కాంగ్రెస్లో కొనసాగాలంటే కండీషన్స్ అప్లై:బండ్ల
తన డిమాండ్లు నెరవేరిస్తేనే కాంగ్రెస్ లో కొనసాగాలని.. లేదంటే బీఆర్ఎస్ లోకి వెళ్లాలనే ఆలోచనలో గద్వాల ఎమ్మెల్యే ఉన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఫిరాయింపు రాజకీయాలు మంత్రులు లేని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల రాకను కాంగ్రెస్ నేతలు, శ్రేణులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతలు మొదలు సామాన్య కార్యకర్త వరకు ఫిరాయింపులకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతున్నారు. అయినా రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ మారేవాళ్లకు తన పరిధిలో లేని హామీలు ఇస్తూ కండువా కప్పి మమ అనిపిస్తున్నారు. తర్వాత ముఖం చాటేస్తున్నారు. అందుకే రేవంత్ను నమ్ముకుంటే లాభం లేదని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఘర్ వాపసీ బాట పట్టారు. దీంతో తన పరువు పోతుందని రేవంత్ విందు రాజకీయాలు మొదలుపెట్టారు. సీఎం పంపిన దూతలు బుజ్జగించినా.. హామీలు ఇచ్చినా వాళ్ల వైఖరి మారడం లేదు.
ఈ నేపథ్యంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లోనే కొనసాగాలని బుజ్జగించారు. ఈ సందర్భంగా మంత్రి ముందు గద్వాల ఎమ్మెల్యే అనేక డిమాండ్లు పెట్టారు. గద్వాల లో తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని, ఎంపీ మల్లు రవి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, పార్టీ ఇన్ ఛార్జ్ గా సరిత తిరుపతయ్యను తప్పించాలని, తనకు ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలని డిమాండ్లు పెట్టారు. సరే సరే ఇవన్నీ చేస్తామని ముందు మనమిద్దరం కలిసి సీఎం ఇంటికి వెళ్దామని మంత్రి జూపల్లి కృష్ణ మోహన్ రెడ్డిని సీఎం ఇంటికి తీసుకెళ్లారు. నాకు అప్పగించిన పని పూర్తయ్యిందని అన్నట్టు బండ్లను సీఎంతో కల్పించారు. అయితే డామిట్ కథ అడ్డం తిరిగినట్టు సీఎం ను మర్యాద పూర్వకంగా నే కలిసినట్టు కృష్ణమోహన్రెడ్డి చెప్తున్నారు. తన డిమాండ్లు నెరవేరిస్తేనే కాంగ్రెస్ లో కొనసాగాలని.. లేదంటే బీఆర్ఎస్ లోకి వెళ్లాలనే గద్వాల ఎమ్మెల్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
సీఎంను కలిసిన వారిలో మంత్రి కృష్ణారావుతో పాటు బండ్ల కృష్ణమోహన్రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు ఉన్నారు.