హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
166 రోజులకు తిరిగి సొంత గడ్డపై అడుగు పెట్టిన ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో బయల్దేరిన కవిత, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు సాయంత్రం 5 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కవితకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మంగళవారం వరకు ఆమె తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుప్రీం కోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం రాత్రి ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం మధ్యాహ్నం భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె హైదరాబాద్ కు బయల్దేరారు. 166 రోజులకు కవిత సొంత గడ్డపై అడుగుపెట్టారు.