జయశంకర్సార్కు బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు ,జగదీశ్రెడ్డి, మహబూబ్ అలీ తదితరులు నివాళులు అర్పించారు.
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయను ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్లో విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, మహబూబ్ అలీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్మే రావుల చంద్రశేఖర్రెడ్డి, దేవీ ప్రసాద్ తదితరులు నివాళులు అర్పించారు.
'ఆరు దశాబ్దాలు తెలంగాణనే స్వప్నించి, శ్వాసించి మూడు తరాల ఉద్యమకారులకు ప్రేరణగా నిలిచిన మహా మనీషి ప్రొఫెసర్ జయశంకర్ సార్' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 'తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన సిద్ధాంత కర్త. మీ స్ఫూర్తిని చెదరకుండా మా గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నాం' అని మాజీ మంత్రి హరీశ్రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా జయశంకర్ సార్కు నివాళులు అర్పించారు.
అలాగే పటాన్చెరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డితోపాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.