వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం విరాళంగా ప్రకటించిన హరీశ్ రావు
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తి నష్టపోయిన బాధితుల కోసం బీఆర్ఎస్ పార్టీ విరాళం ప్రకటించింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతాన్ని విరాళంగా ప్రకటించాలని పార్టీ చీఫ్ కేసీఆర్ సూచించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాకు ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రంలో వరద ఉధృతికి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, తాము నల్గొండ, ఖమ్మం పర్యటనల్లో వరద సృష్టించిన విళయాన్ని కల్లారా చూశామని తెలిపారు.
6,200 మంది పార్ట్ టైం టీచర్లను తొలగించి టీచర్స్ డే గిఫ్ట్ ఇచ్చారా?
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న 6,200 మంది పార్ట్ టైం, గెస్ట్ టీచర్లు, లెక్చరర్లను ఏకకాలంలో తొలగించి వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి టీచర్స్ డే గిఫ్ట్ ఇచ్చారా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వాళ్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వాలేదని, ఇదేమిటని అడిగితే వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించారని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. విద్యాసంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోఖం మిగిల్చారన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే టీచర్ల బతుకులను ఆగం చేశారన్నారు. ప్రభుత్వం వెంటనే తొలగించిన పార్ట్ టైం, గెస్ట్ లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలని, వారికి చెల్లించాల్సిన వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు.