పాపి కొండల విహార యాత్రకు బ్రేక్
గోదావరి నీటి మట్టం పెరగడంతో పాపికొండల విహారయాత్రకు మూడు రోజులపాటు బ్రేక్ పడింది.
ఏపీలో తుపాను హెచ్చరిక నేపధ్యంలో పాపి కొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. మూడు రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు. గోదావరిలో నీటి ఉధృతి క్రమంగా పెరుగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్లోనూ టికెట్ల అమ్మకాలను బోటు నిర్వాహకులు నిలిపివేశారు. అమ్మవారి ఆలయం వద్ద మొన్నటివరకూ నిలకడగా ఉన్న నీటిమట్టం రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది.
వీరవరపులంక పరిసర ప్రాంతాల్లో ఇసుక తెన్నెలు వరదనీటిలో మునుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రానికి అడుగుమేర నీటి మట్టం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. గోదావరి నదీ ప్రవాహం ఆహ్లాదభరితంగా సాగుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో పాపికొండల అందాలు వర్ణించలేనంత ముచ్చట గొలుపుతాయి. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకు రాల్చవు. ఇది అత్యంత ప్రశాంతమైన,సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి కొండలు, జల పాతాలు, గ్రామీణ వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీరం అని కూడా పిలుస్తారు.