చేగూరు చౌరస్తాలో లారీ బీభత్సం.. ఇద్దరు మృతి
మద్యం మత్తులో ఇద్దరని బలిగొన్న లారీ డ్రైవర్
మద్యం తాగిన లారీ డ్రైవర్ నేషనల్ హైవేపై బీభత్సం సృష్టించాడు. పలు వాహనాలను ఢీ కొట్టి తల్లీ బిడ్డల మరణానికి కారణమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకలోని హుగ్లీ నుంచి హైదరాబాద్కు లోడుతో వస్తున్న లారీ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం చేగూరు చౌరస్తా వద్దకు రాగానే అదుపు తప్పింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ షేక్ మహమ్మద్ స్టీరింగ్పై నియంత్రణ కోల్పోవడంతో లారీ ముందు వెళ్తున్న టెంపో, ఆటో, రెండు మోటర్ బైక్లను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న షాద్నగర్ పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తల్లి కావ్య (24), కూతురు అనన్య (1) అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి సాయికృష్ణ, కూతురు నిహారిక (4) గాయాలతో బైటపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.