మణిపూర్ లో మళ్లీ హింస
పరస్పరం కాల్పులు .. ఆరుగురి మృతి
మణిపూర్ లో శనివారం మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ఉదయం నిద్రపోతున్న ఒకరిని కాల్చిచంపారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. రెండు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ లోని చూరాచాంద్ పూర్ లో నిషేధిత మిలిటెంట్ గ్రూప్ నకు చెందిన మూడు బంకర్లను భద్రత బలగాలు శనివారం ధ్వంసం చేశాయి. ఈ బంకర్ల వద్ద నుంచే బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ లాంచర్లతో దాడులకు తెగబడ్డారని భద్రత బలగాలు చెప్తున్నాయి. ఈ రాకెట్ దాడిలో ఒకరు మృతిచెందారు. ఒక రాకెట్ లాంచర్ మొయిరంగ్ లోని మాజీ సీఎం మైరెంబమ్ కొయిరెంగ్ ఇంటి సమీపంలో విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలో భద్రత బలగాలు గాలింపులు జరిపి బంకర్లను గుర్తించి కూల్చేశాయి. మణిపూర్ లోనే కొన్నేళ్లుగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింసలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.