గాజాలో ఇజ్రాయిల్ వైమానిక దాడి.. 39 మంది మృతి
గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీసుకుంటున్నాయి.ఇజ్రాయిల్ చేసిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీసుకుంటున్నాయి. శనివారం ఇజ్రాయిల్ చేసిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు ఆస్పత్రి అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గాజాలోని పురాతన నగరమైన అల్ -షాతీ శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారు అల్ తుఫా జిల్లాలో చనిపోయారు. అల్ -షాతీ శిబిరంపై ఇజ్రాయిల్ దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఇక్కడ దాడులు జరిగాయి.
దాడుల తర్వాత ఈ ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వారిని తరలిస్తున్న వీడియోలు బైటికి వచ్చాయి. శిథిలాల కింద మృతుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయిల్ సైన్యం మాత్రం హమాస్ సైనిక నిర్మాణాలపై దాడులు చేశామని పేర్కొన్నది.
గాజాలో ఏ స్థలం సురక్షితంగా లేదని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. ఇప్పటికే చాలామంది మంది నగరం నుంచి పారిపోయారని, ఆహారం, నీళ్లు, వైద్య సౌకర్యాలు లేకుండా గుడారాలు, ఇరుకైన అపార్ట్మెంట్లలో చాలా కుటుంబాలు ఆశ్రయం పొందుతున్నాయయని తెలిపింది. అక్కడ మానవీయపరిస్థితులు భయంకరంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.