ఫర్నీచర్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. బాలిక మృతి

హైదరాబాద్‌లోని జియాగూడలోని వెంకటేశ్వర నగర్‌లో ఫర్నీచర్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదేళ్ల బాలిక మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది.

By :  Raju
Update: 2024-07-24 04:05 GMT

హైదరాబాద్‌లోని జియాగూడలోని వెంకటేశ్వర నగర్‌లో ఫర్నీచర్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భవనం, పరిసర ప్రాంతంలో భారీగా మంటలు, పొగ వ్యాపించడాన్ని స్థానికులు గమనించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంలో విషాదం చోటుచేసుకున్నది. ప్రమాద సమయంలో గోదాంలో ఈ 20 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరినీ నిచ్చెన ద్వారా సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. ఐదేళ్ల బాలిక ప్రియ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక కుటుంబానికి చెందిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రమాదానికి కారణమైన భవనం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే రాత్రి సమయంలో అంతమంది గోదాంలో ఎందుకు ఉన్నారు? వారంతా ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News