అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈడీ అధికారి ఆత్మహత్య
ఢిల్లీలో ఈడీ అధికారి అలోక్ రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలోక్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే.
ఢిల్లీలో ఈడీ అధికారి అలోక్ రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలోక్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇటీవలే సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం సాహిబాబాద్లోని రైల్వే ట్రాక్ పక్కన అతని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనా స్థలం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
అలోక్ రంజన్ది ఘాజియాబాద్. డిప్యూటేషన్పై ఈడీలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన ఆదాయపన్ను విభాగంలో విధులు నిర్వహించారు. ఇటీవల అవినీతి కేసులో సీబీఐ ఆయనను రెండుసార్లు విచారించింది. అయితే నేరం చేసినట్టు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆయనను విడిచి పెట్టారు.
రూ. 50 లక్షలు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఈడీ డైరెక్టర్ సందీప్ సింగ్ను బీసీబీ బృందం ఆగస్టు 7న అరెస్టు చేసింది. ఫిర్యాదుదారుడి కుమారుడిని అరెస్టు చేయకుండా ఉండేందుకు సందీప్ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించినట్లు సీబీఐ పేర్కొన్నది. ఢిల్లీలోని లజ్పత్ నగర్లో రూ. 20 లక్షలు లంచం తీసుకుంటుండగా సింగ్ పట్టుబడినాడు. ఆ డబ్బును ముంబాయికి చెందిన నగల వ్యాపారి అందించారు. ఈ క్రమంలోనే ఈడీ దాడులు చేసింది. ఎఫ్ఐఆర్లో సందీప్ సింగ్ను నిందితుడిగా పేర్కొన్న ఈడీ ఆ తర్వాత సస్పెండ్ చేశారు. ఎప్ఐఆర్లో అలోక్ రంజన్ పేరు కూడా ఉన్నది. దీంతో ఈడీ సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.