కేసీఆర్ ను అవమానించిన సీఎం రేవంత్ పై ఫిర్యాదు

పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు

Update: 2024-08-20 16:55 GMT

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అవమానించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు పంజాగుట్టా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రాత్రి పంజాగుట్ట పోలీసులను కలిసి ఫిర్యాదు అందజేశారు. మంగళవారం సోమాజిగూడలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతిలో కేసీఆర్ పై అవమానకర వ్యాఖ్యలు చేశారని, బతికే ఉన్న కేసీఆర్ విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదుట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘అధికారం పోయినా, బలుపుమాత్రం తగ్గలేదు.. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు అని టీఆర్ఎస్ సన్నాసులకు చెప్తున్న..”అంటూ ఘోరమైన భాషలో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ మాట్లాడిన వీడియో క్లిప్ ను కంప్లైంట్ కు జత చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News