బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదు
ఆర్జీకర్ ఆస్పత్రి భద్రత విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్
ఆర్జీ కర్ ఆస్పత్రిలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది మోహరింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వసతి, భద్రత పరికరాల నిర్వహణ, రవాణా సౌకర్యాల లేమితో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కేంద్రం పేర్కొన్నది. సీఐఎస్ఎఫ్కి పూర్తి సహకారాన్ని అందించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం కోరింది. ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించని పక్షంలో కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉంటుందని చెప్పాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
వైద్యురాలిపై హత్యాచారం ఉదంతరం తర్వాత ఆర్జీకర్ ఆస్పత్రిపై ఆందోళకారులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో కోల్కతా పోలీసులు అక్కడి నుంచి పారిపోయాన్న ఆరోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు కేంద్ర బలగాలతో ఆస్పత్రికి రక్షణ కల్పించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్కు ఎనిమిది రోజుల కస్టడీ
ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవలకు పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ అధికారులు ఆయనను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార కేసులో సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్నారు.