ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టిన లారీ-కారు-టాటా ఏస్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ- కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని క్యాన్సర్ ఆసుపత్రి ముందు ప్రమాదం జరిగింది. పోలీసుల కధనం ప్రకారం విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న రెడీమిక్స్ వాహనం పెదకాకాని సమీపంలో హైవేపై బ్రేక్ డౌన్ అయింది. దీంతో వాహనాన్ని రోడ్డుకు కుడి పక్కన నిలిపిన డ్రైవర్.. మెకానిక్ ను తీసుకొచ్చి రిపేర్ చేయిస్తున్నాడు. అయిదే దానిని గమనించకుండా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.
దీంతో రెడీమిక్స్ వాహనం రోడ్డు మధ్యకు జరిగింది. అదే సమయంలో వెనుక నుంచి కూలీలతో వస్తున్న టాటాఏస్ మినీ ట్రక్ దానిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులను కే.రాంబాబు, తేజ, మధుగా గుర్తించామన్నారు. వీరంతా డెకరేషన్ పనుకు వెళ్లివస్తున్న కూలీలని చెప్పారు. గాయపడిన వారిని జీజీహెచ్కు తరలించామన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని గుంటూరులోని ఆసుపత్రులలో చేర్పించి, చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.