అవ్.. మూసీ బ్యూటిఫికేషన్ కు అక్షరాల లక్షన్నర కోట్లు!
''తెలంగాణ గ్రోత్ స్టోరీ''లో ఘనంగా చెప్పుకున్న రేవంత్ సర్కారు
రాబోయే ఐదేళ్లలో మూసీ రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్షరాల లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. అవును మీరు చదువుతున్న ప్రతి అక్షరం వాస్తవమే. స్వయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఈ మాట చెప్పింది. ఈ ఏడాది జూలై 20న గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయబోతుందని ప్రకటించారు. లెక్కా పత్రం.. డీపీఆర్ లాంటివేవి లేకుండా రేవంత్ నోటికి వచ్చిన గోపన్ పల్లి లెక్కను ఆ సభలో చెప్పేశారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఇదే మాట లేవనెత్తితే తాము ఎక్కడా అలా చెప్పలేదని దాటవేసే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు కార్నర్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు రెస్క్యూకు వచ్చారు. తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రికి రక్షణ కవచంలా నిలిచారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఖర్చుపై అసెంబ్లీలో లెక్కలు చెప్పడానికి కిందామీద పడ్డ ప్రభుత్వం ''వరల్డ్ ట్రేడ్ సెంటర్'' తెలంగాణ గ్రోత్ స్టోరీ - ద రోడ్ టు వన్ ట్రిలియన్ ఎకానమీ 2024 -25'' నివేదికలో మూసీ రివర్ ఫ్రంట్ పై ఎంత ఖర్చు చేయబోయేది స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ’ఫార్వర్డ్‘ మెసేజ్ తోనే ఈ బుక్ లెట్ పబ్లిష్ చేశారు. 2036 నాటికి తెలంగాణ వన్ ట్రిలియన్ యూఎస్ డాలర్ ఎకానమీకి చేరుకోవడమే తమ లక్ష్యమని రేవంత్ తన మెసేజ్ లో వెల్లడించారు.
''తెలంగాణ గ్రోత్ స్టోరీ''లో మూసీ రివర్ ఫ్రంట్ పూర్తయిన తర్వాత నది ఎలా మారబోతుందనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోను పబ్లిష్ చేశారు. రాబోయే ఐదేళ్లలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు (18 అమెరికన్ బిలియన్ డాలర్లు) చేయబోతున్నట్టుగా ప్రకటించారని రాసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రౌండ్ ది క్లాక్ (24 గంటల పాటు) వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు కొనసాగించ వచ్చని, ఐటీ టవర్స్, రిటైల్, ఎంటర్టైన్మెంట్ స్పేసెస్ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. లండన్ లోని థేమ్స్ నది తరహాలో మూసీపై ఎక్కడికక్కడ బ్రిడ్జీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ స్వరూపమే మారిపోతుందని ప్రకటించారు. ఈ బుక్ లెట్ ద్వారా మూసీ రివర్ ఫ్రంట్ కు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని రేవంత్ రెడ్డి యథాలాపంగా అనలేదని.. పద్ధతి ప్రకారమే భారీ ప్రాజెక్టు చేపట్టబోతున్నామనే ముచ్చట చెప్పారని ఈ బుక్ లెట్ ద్వారా తేటతెల్లమవుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేశారు. దీనిపై ఇప్పటి వరకు నిర్దిష్టమైన డీపీఆర్ సిద్ధం కాకున్నా నోటి మాటల స్థాయిలోనే ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.58 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు పెంచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి లండన్ లోని థేమ్స్ నదిని పరిశీలించారు. అక్కడి నుంచి దుబయ్కి వెళ్లి మూసీ బ్యూటిఫికేషన్ పై దాదాపు 70 నిర్మాణ సంస్థలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.58 వేల కోట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత రూ.75 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు చేపడుతామని చెప్పారు. జూలై 20న గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.1.50 లక్షల కోట్లతో మూసీని సుందరీకరించి, అభివృద్ధి చేసి లండన్ లోని థేమ్స్ నది తరహాలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ నుంచి సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్ వరకు పదుల సంఖ్యలో లిఫ్టులు, వందలాది కిలో మీటర్ల కాల్వల ద్వారా గోదావరి నీళ్లను తరలించే 'కాళేశ్వరం' ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు రూ.96 వేల కోట్లు. ఈ లెక్కన మూసీ నది బ్యూటిఫికేషన్ లో బంగారం, ప్లాటినం లాంటి విలువైన లోహాలను కరిగించి పోతలు పోస్తే రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతాయా అనేది ఇంజనీర్లకే అంతుచిక్కడం లేదు. అయినా తాము చెప్పిందే వేదం అన్నట్టుగా రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టుగా రేవంత్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమైతే తప్పా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎందుకు ఇంతలా పెరిగిందో ఎవరికీ అర్థం కాదు. అట్లుంటది మరి మన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అంటే!!
మాటల దశలోనే లక్ష కోట్లు పెరిగిన ‘మూసీ’ స్టోరీని చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి