ఏడు నెలల్లో ఏడు పైసలు ఇవ్వలేదు: హరీశ్‌రావు

కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసిందని, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

By :  Raju
Update: 2024-07-02 07:57 GMT

రాష్ట్రంలో రేవంత్‌ సర్కార్‌ ఏడు నెలల కాంగ్రెస్‌ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారు. ఈ ఏడు నెలల్లో గ్రామాలకు ఏడు పైసలు కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ మధుసూదనా చారి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామాలను చాలా అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ గ్రామాలను కేసీఆర్‌ దేశానికి ఆదర్శంగా నిలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంచాయతీ అవార్డుల్లో ఎక్కువ భాగం తెలంగాణ గ్రామాలకే వచ్చేవని గుర్తు చేశారు. దీన్‌ దయాళ్‌, సంసద్ ఆదర్శ యోజన అవార్డులు తెలంగాణకు వచ్చాయి. కానీ కాంగ్రెస్‌ పాలనలో గ్రామాలు కునారిల్లుతున్నాయి. మురికి కూపాలుగా మారుతున్నాయి. అస్తవ్యస్తంగా మారాయని మండిపడ్డారు. నాడు 87 ట్రాక్టర్లు మాత్రమే ఉంటే, మా హయాంలో 12,769 పంచాయతీల్లో ట్రాక్టర్లు ఇచ్చామన్నారు. అలాంటి పల్లెలు నేడు కాంగ్రెస్ పాలనలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. అస్తవ్యస్తం అవుతున్నాయి. ట్రాక్టర్లు మూలన పడ్డాయి. డీజిల్‌ కూడా పోయించే పరిస్థితి లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ టాక్స్ లేదు, బీమా లేదు అని ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నరు. పంచాయతీ సెక్రటరీలు చెప్పినా అధికారులు వినడం లేదన్నారు. సొంత డబ్బులు పెట్టీ పంచాయతీ సెక్రటరీలు డీజిల్ పోయిస్తున్నారు. కరెంటు బుగ్గలు పెడుతున్నరు. పారిశుధ్య కార్మికులు 7 నెలలు జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ బిల్లులు కట్టడం లేదు. ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కట్టడం లేదు. దీంతో గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. దీంతో అనేక గ్రామాల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయిందన్నారు. పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడిక్కడ పేరుకు పొయ్యింది. స్పెషల్ డ్రైవ్ కాదు, ఉన్న చెత్త ఎత్తుకోవడం లేదు. ప్రజా పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా? జీతాలు లేకుండా వాళ్లు ఎలా బతుకుతారు?ఎందుకు సమీక్షలు చేయడం లేదు? సమయం ఉండటం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి ఇలా తయారైందన్నారు.

ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?

సర్పంచుల కాలం ముగిసింది. జిల్లా పరిషత్ కాలం ముగుస్తున్నది. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. చివరకు గవర్నర్ ను కలిసి సర్పంచులు వినతి ఇచ్చే పరిస్థితి వచ్చింది. వానాకాలం వచ్చింది. పంచాయతీల్లో డబ్బులు లేక ట్రాక్టర్ డీజిల్ పైసలు లేవు, ఫాగింగ్ లేదు, విద్యుత్ నిర్వహణ లేదు. మేము ప్రతి నెలా రూ. 275 కోట్లు, ఏటా రూ. 3330 కోట్లు పల్లెల్లో అభివృద్ధి కోసం ఇచ్చాం. పట్టణాలకు ఏటా 1700 కోట్లు ఇచ్చే వాళ్ళం. మీరు ఏడు నెలల్లో ఎందుకు ఏడు పైసలు ఇవ్వలేదు? స్థానిక సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? అని హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా, డెంగీ వైరల్ జ్వరాలు ప్రభలితే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాం. పల్లె, పట్టణ ప్రగతి కోసం 20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎంత దారుణం అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా జీతం రాలేదు. రిటైర్మెంట్ శాలువాలు కప్పుకొని జీతాలు రాలేదు అని అంటున్నారు. తక్షణం పారిశుద్ధ్య కార్మికులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?

రెండు నెలల పింఛన్‌ వెంటనే ఇవ్వాలి

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, చేసిన పనులకు గాను సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ప్రభుత్వ నిధులు విడుదల చేయాలి. పారిశుద్ద్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలి వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది కాబట్టి, గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి, పారిశుద్ద్యం పెంపొందించాలి. నిరుద్యోగులను నిలువున ముంచారు. సంక్షేమాన్ని సమాధి కట్టారు. అంక్షలు తప్ప పింఛన్లు లేవు. చంద్రబాబు బకాయిలతో కలిపి 4 వేల ఫించన్ ఇస్తే, ఇచ్చేవి ఇవ్వడం లేదు. పెంచడం లేదు. రెండు నెలల ఆసరా పింఛన్‌ వెంటనే విడుదల చేయాలి.

ప్రభాకర్ కుటుంబానికిరూ. 25 లక్షల ఎక్స్‌గ్రేసియా, కుటుబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్న అని ఒక రైతు ప్రభాకర్ ఖమ్మంలో చనిపోయారు. ఎంతో బాధ వేసింది. ఆయన ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆ వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రభాకర్ తండ్రి పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పాలన కారణమని ఆరోపించారు. ఎస్సై, ఎమ్మార్వో, కలెక్టర్ వీరిలో ఎవరు పట్టించుకున్నా న్యాయం జరిగేది. ఏ రైతు ప్రాణాలు కోల్పోవద్దు. ప్రశ్నించే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి. వారు వినకుంటే మాకు చెప్పండి. మీ తరుపున పోరాటం చేస్తం. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయకుండా, వీడియో తీసిన వారి మీద కేసులు పెడతారట. ఆ రైతు నేరుగా మీ పేరు చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ రైతు తరుపున ముఖ్యమంత్రికి చెబుతున్నాం అరెస్టు చేసి కేసులు పెట్టీ, ఆయన భూమి ఆయనకు అప్పగించాలన్నారు.ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేసియా, కుటుబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం వాస్తవాలు తెలిసేలా, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

7 మండలాలు, లోయర్‌ సీలేర్‌ తెలంగాణకు వచ్చేలా చూడండి

రాష్ట్ర విభజన సమస్యల మీద ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారడం సంతోషం అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలో 7 మండలాలు, లోయర్ సీలేరు ఏపీలో కలిపారు. కేసీఆర్‌ నాడు తీవ్రంగా స్పందించి, నిరసన తెలిపారు. ఆ బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్‌. మీ సహచరుడు మీదనే ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడింది. చంద్రబాబు మీద ఒత్తిడి చేసి 7 మండలాలు, లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలి. ఆ తర్వాత విభజన హామీల గురించి మాట్లాడాలని సీఎం రేవంత్‌కు హరీశ్‌ సూచించారు.

Tags:    

Similar News